ఈ ప్రభుత్వం ఎంతకాలం పనిచేస్తుందో!: అసెంబ్లీలో ఉదయనిధి స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • విశ్వాస పరీక్షలో నెగ్గిన విజయ్ ప్రభుత్వం
  • చర్చ సందర్బంగా ప్రభుత్వం మనుగడపై ఉదయనిధి అనుమానాలు
  • ప్రభుత్వానికి ఓటు వేసినందుకు ప్రజలు పశ్చాత్తాపపడుతున్నారని వ్యాఖ్య
తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైన టీవీకే అధినేత విజయ్ అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకున్నారు. బుధవారం జరిగిన బలపరీక్షలో స్పష్టమైన మెజారిటీతో విజయ్ ప్రభుత్వం నెగ్గింది. విశ్వాస పరీక్షకు ఓటింగ్ సందర్భంగా డీఎంకే సభ నుంచి వాకౌట్ చేసింది.

విశ్వాస పరీక్ష సందర్భంగా ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభుత్వాన్ని ఉద్దేశించి, ఈ ప్రభుత్వం ఎంతకాలం మనుగడ సాగిస్తుందోనని రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎంతకాలం మనుగడ సాగిస్తుందో తెలియని ప్రభుత్వానికి ఓటు వేసినందుకు ప్రజలు పశ్చాత్తాపపడుతున్నారని అన్నారు. 

తమిళనాడులో లౌకికవాద ప్రభుత్వమే ఉండాలని ఆకాంక్షించారు. ఎన్నికల్లో రాష్ట్రంలోని దాదాపు 65 శాతం మంది ఓటర్లు ముఖ్యమంత్రి విజయ్, టీవీకేను తిరస్కరించారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మిత్రపక్షాలతో కలిసి అధికారంలోకి వచ్చారని, కనీసం ఇప్పుడైనా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే రీతిలో పనిచేయాలని సూచించారు. ఎందుకంటే మీకు ఓటు వేసిన ప్రజలే ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నారని అన్నారు.

ఈ ప్రభుత్వం ఎంతకాలం కొనసాగుతుందోనని ప్రజల్లో అనుమానాలు నెలకొన్నాయని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కొత్త ప్రభుత్వానికి సూచించారు. విశ్వాస ఓటింగ్‌లో తమ పార్టీ పాల్గొనడం లేదని, డీఎంకే ఎమ్మెల్యేలం వాకౌట్ చేస్తున్నామని ఉదయనిధి స్టాలిన్ తెలిపారు.

డీఎంకేతో పాటు మిత్రపక్షమైన ఎంఎంకే కూడా విశ్వాస పరీక్షను వ్యతిరేకించింది. మంత్రివర్గంలో ముస్లింలకు ప్రాతినిథ్యం లేకపోవడాన్ని ఆ పార్టీ నాయకుడు జవహిరుల్లా ప్రస్తావించారు. డీఎంకే మరో మిత్రపక్షం ఎంజేకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసింది. విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ మద్దతు ప్రకటించాయి. ఏఎంఎంకే పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే ఎస్. కామరాజ్ కూడా ప్రభుత్వానికి మద్దతు పలికారు. దీంతో ఆయనను ఏఎంఎంకే పార్టీ నుంచి బహిష్కరించారు.

Udhayanidhi Stalin
Tamil Nadu
TVK
Vijay Tamil Nadu CM
DMK walkout
Tamil Nadu Assembly

More Telugu News